జర్నలిస్ట్ జమల్పూర్ గణేష్ కు తెలంగాణ హరిదా పురస్కారం…

Nizamabad Bureau Sanjeev Yedla

జమాల్పూర్ గణేశ్ కు “హరిదా తెలంగాణ” పురస్కారం…

తెలంగాణకు శాపం కానున్న బనకచర్ల : జామల్పూర్ గణేష్

నిజామాబాద్ అర్బన్, ప్రజాజ్యోతి, జూన్ 5:

తెలంగాణకు తీవ్ర నష్టం చేసే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని, తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కావలసిన మరమ్మత్తులు చేసి పునరుద్ధరించాలని సీనియర్ జర్నలిస్ట్ జమాల్పూర్ గణేష్ అన్నారు. బుధవారం రాత్రి స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ మహోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలంతా ఈ రెండు అంశాలలో ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఏ నీళ్ల కోసం అయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో మళ్లీ ఈ సందర్భంలో మరో ఉద్యమానికి తెర తీయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. మేధావులు రాజకీయ శక్తులు కలిసి పోరాడాలని, ఈ అంశాలు తెలంగాణ ఆత్మతో ఆలోచిస్తేనే అర్థమవుతాయని ఆయన వివరించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత నిర్వహించిన మహాధర్నా బనకచర్ల అంశాన్ని చర్చనీయాంశంగా చేసిందని అన్నారు. పాలకుల పట్ల ఎవరి ధోరణి వారిదైనా బనకచర్ల తెలంగాణను ఎడారి చేస్తుందని, కాళేశ్వరం తెలంగాణకు ఎంతో మేలు చేసే ప్రాజెక్టు అని ఈ రెండు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదికతో కలిసి హరిదా రచయితలు నిజామాబాద్ నుంచి బాసర వరకు చేసిన పాదయాత్ర, కలాల కవాతు వంటి కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య ఘట్టాలని గుర్తు చేసుకున్నారు. జిల్లా తెలంగాణ ఉద్యమంలో సాహిత్య ఉద్యమాన్ని సమాంతరంగా హరిదా రచయితల సంఘం నడిపిందని అభినందించారు.
జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో సబ్బండవర్ణాలను భాగస్వాములుగా చేయడంలో జమాల్పూర్ గణేశ్ నిర్వహించిన పాత్ర ఆదర్శనీయమని ఆయన నిత్య చైతన్య శీలి అని హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. మేధావులు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు ఇలా అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండి ఉద్యమ ఉధృతికి జమాల్పూర్ గణేశ్ అందించిన తోడ్పాటు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఈ సంవత్సరం గణేశ్ కు ” తెలంగాణ ఆవిర్భావ మహోత్సవ పురస్కారాన్ని” అందజేయడం గర్వకారణంగా భావిస్తున్నట్టు తెలిపారు. సీనియర్ కవి పంచరెడ్డి లక్ష్మణ్ మాట్లాడుతూ జర్నలిజంలో ప్రమాణాలు నెలకొల్పిన వ్యక్తి గణేశ్ అని, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడని అభినందించారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణకు జరిగిన అన్యాయంపై సంపూర్ణ అవగాహన కలిగి తోటి ఉద్యమకారులను, ప్రజలను ఉత్తేజ పరచడంలో జమాల్పూర్ గణేశ్ కీలకపాత్ర పోషించాడని అన్నారు. తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ తిరుమల శ్రీనివాస్ ఆర్య మాట్లాడుతూ వార్తలు రాయడంలో గణేశ్ శైలి ప్రత్యేకమని కొనియాడారు. ప్రముఖ కవి దారం గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తూ ఆయన రాసిన వార్తలు వ్యాసాలు కొత్త విషయాలు తెలియజేశాయని అన్నారు. ఇందూరు యువత అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ ఉద్యమంలో గణేష్ పెద్దన్న పాత్ర పోషించాడని తన అనుభవాలను తెలియజేశాడు. సీనియర్ జర్నలిస్టు గంగాదాసు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఇంత గొప్పదో జమాల్పూర్ గణేశ్ అనుభవాలు తెలియజెప్పుతాయని అన్నారు. సీనియర్ న్యాయవాది తెలంగాణ ఉద్యమకారుడు అంతడుపుల ఆశా నారాయణ మాట్లాడుతూ తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా మేధావులను కూడగట్టడంలో తనలాంటి వారిని ప్రోత్సహించడంలో జమాల్పూర్ గణేశ్ ఆదర్శంగా ఉన్నాడని అన్నారు. నవీపేట్ జేఏసీ చైర్మన్ డాక్టర్ సల్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నా వారిని సమన్వయ పరిచిన వారి గొప్పతనం మాటల్లో చెప్పలేని జమాల్పూర్ గణేశ్ సమన్వయకర్తగా ఉద్యమాన్ని ప్రతి పల్లెలోకి చేర్చాడని అన్నారు. ప్రముఖ కవి గాయకుడు సిర్పలింగం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలో అనేకమంది కళాకారులను ఆహ్వానించి ధూంధాంలను నిర్వహించడం ద్వారా నిజామాబాద్ జిల్లాను ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలపాడని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి గుత్ప ప్రసాద్, నాగనాథ్ థామస్కర్, రాయల మధు, బంగ్లా సాయిలు, డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, వినయ్, సిర్పలింగం, డాక్టర్ సల్ల సత్యనారాయణ, తిరుమల శ్రీనివాస్ ఆర్య, రూపేశ్ కుమార్, నరాల సుధాకర్, పంచ రెడ్డి లక్ష్మణ్, దారం గంగాధర్, డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, కిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు జమాల్పూర్ గణేశ్ కు “హరిదా తెలంగాణ ఆవిర్భావ మహోత్సవ పురస్కారాన్ని” అందజేసి ఘనంగా సత్కరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *