భూభారతితో రైతులకు సంక్షేమం
వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్
నిజామాబాద్ అర్బన్, ప్రజాజ్యోతి, జూన్ 3 :
నిజామాబాద్ జిల్లా అర్బన్ నియోజకవర్గంలోని సిఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించబడిన భూభారతి కొత్త చట్టం గురించి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన సమావేశం లో ముఖ్యఅతిథిగా
తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం రైతులందరికీ భూభారతి గురించి అవగాహన కల్పించాలని సూచించారని అన్నారు. భూభారతి పోర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ భూముల నిర్వహణకు కోసం భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఏప్రిల్ 14న 2025 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఈ తెలంగాణ భూ పరిపాలనలోని ధరణి స్థానంలో కొత్తగా ఆర్.ఓ.ఆర్ చట్టం భూభారతి పోర్టల్-2025 ను గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ భూభారతి చట్టం వలన రైతులకు ఇబ్బంది కలగకుండా దీనివలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని అన్నారు. భూధార్ అంటే ప్రతి మనిషికి ఆధార్ కార్డు అలాగా ప్రతి భూకమతానికి ప్రత్యేక సంఖ్యతో కూడిన భూదార్ సేవలు అందుబాటులో ఉంటాయి. గ్రామస్థాయిలోనే రెవెన్యూ సేవలు, చట్టబద్ధ హక్కుల నమోదు, సాదా బైనమాల క్రమబద్ధీకరణ,
పగడ్బందీగా మ్యుటేషన్, భూ రికార్డుల సవరణ,
భూ హక్కుల కల్పన ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నార్త్ ఎమ్మార్వో విజయకుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, సంబంధిత అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.