నిమ్మ రైతులు కనీవినీ ఎరుగని రీతిలో నష్టాలను చవిచూస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో కిలో వంద రూపాయలకు పైగా పలికిన నిమ్మ ధర ప్రస్తుతం దారుణంగా పతనమై కిలో 15 నుంచి 20 రూపాయలకే పరిమితమైంది. ఈ ఊహించని ధరల పతనంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఏలూరు జిల్లాలో వేల ఎకరాల్లో రైతులు నిమ్మ సాగు చేస్తున్నారు. గత ఏడాది నిమ్మకు రికార్డు స్థాయిలో ధర లభించడంతో, ఈ ఏడాది చాలా మంది రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు, ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు అధిక మొత్తంలో కౌలు చెల్లించి మరీ సాగు చేపట్టారు. అయితే, ఈ ఏడాది మే నెల ఆరంభం నుంచే ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని దయనీయ స్థితి నెలకొంది.
“గతేడాది కిలో 100 రూపాయలు దాటిన నిమ్మ ధర ఇప్పుడు కనీసం కోత కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు” అని రైతులు తీవ్రంగా వాపోతున్నారు. దీంతో చాలా తోటల్లో కాయలు కోయకుండానే చెట్లకే వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. లక్షలు వెచ్చించి తోటలు కొన్నవారు, అధిక మొత్తంలో కౌలుకు తీసుకున్నవారు అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా దక్కడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది వ్యాపారులు, దళారులు కుమ్మక్కై కృత్రిమంగా ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు అకాల వర్షాలు కూడా పంట దిగుబడి, నాణ్యతపై ప్రభావం చూపాయని, ఇది కూడా ధరల పతనానికి కొంత కారణమని చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిమ్మ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యాపారుల సిండికేట్ను నియంత్రించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.