విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా స్పందించింది. తమ దేశ విద్యార్థుల ప్రయోజనాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ “అంతర్జాతీయ విద్యార్థులతో పాటు చైనా విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులు, వారి ప్రయోజనాలను కాపాడాలని అమెరికాను కోరుతున్నాం” అని అన్నారు. ఇరు దేశాల మధ్య విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
పరిశోధనా రంగాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న చైనా విద్యార్థులతో పాటు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోందని యూఎస్ సెనేటర్ మార్కో రూబియో ఇటీవల ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారత్ తర్వాత చైనా విద్యార్థులే అధిక సంఖ్యలో ఉన్నారు.
సోషల్ మీడియా ఖాతాలపై నిఘా
విదేశీ విద్యార్థుల వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో భాగంగా వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంపై అమెరికా దృష్టి సారించింది. దీని కోసం “సోషల్ మీడియా వెట్టింగ్” అనే విధానాన్ని అనుసరిస్తున్నారు.
ఇందులో భాగంగా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆన్లైన్ కార్యకలాపాలను అధికారులు పరిశీలిస్తారు. వారి సోషల్ మీడియా ప్రొఫైళ్లను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వీసా మంజూరు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు ఇవ్వడాన్ని నిలిపివేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో ఈ తాత్కాలిక నిలిపివేత అమల్లోకి వచ్చింది.