మనం సాధారణంగా ఒక రోజుకు 24 గంటలు అని లెక్కగడతాం. కానీ, సుదూర భవిష్యత్తులో ఈ లెక్క మారే అవకాశం ఉందని, రోజుకు మరో గంట అదనంగా చేరి 25 గంటలుగా చెప్పుకోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం క్రమంగా మందగించడమే ఇందుకు కారణమని జర్మనీలోని మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సిటీ, అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు.
ఎందుకీ మార్పు?
భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడు ప్రతి సంవత్సరం సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున మన గ్రహం నుంచి దూరంగా జరుగుతున్నాడు. ఈ పరిణామం వల్ల భూమి, చంద్రుడి మధ్య ఉన్న గురుత్వాకర్షణ బలాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చంద్రుడి ప్రభావంతో సముద్రాల్లో ఏర్పడే ఆటుపోట్ల తీరు కూడా మారుతోంది. వీటికి వాతావరణ పరిస్థితులు కూడా తోడై భూభ్రమణ వేగం తగ్గుతోందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. భూమిలో దాదాపు 20 అడుగుల లోతులో అమర్చిన ప్రత్యేకమైన “రింగ్ లేజర్ టెక్నాలజీ” సహాయంతో ఈ సూక్ష్మమైన మార్పులను గుర్తించినట్లు వారు తెలిపారు.
ఇది కొత్తేమీ కాదు
భూభ్రమణ వేగంలో మార్పులు రావడం, తద్వారా రోజులోని గంటల వ్యవధి మారడం అనేది ఇదే మొదటిసారి కాదని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు. సుమారు 140 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు, భూభ్రమణం వేగంగా జరిగి రోజుకు కేవలం 18 గంటలు మాత్రమే ఉండేవని వారు వివరిస్తున్నారు. కాలక్రమేణా చంద్రుడు దూరమవుతున్న కొద్దీ, భూభ్రమణ వేగం తగ్గి, రోజు నిడివి పెరుగుతూ వస్తోంది.
25 గంటల రోజు ఎప్పుడు?
రోజుకు 25 గంటలు అనే మార్పు తక్షణమే సంభవించేది కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మార్పు రావడానికి సుమారు 20 కోట్ల సంవత్సరాలు పట్టవచ్చని అంచనా. అప్పటికి మానవ నాగరికత ఉంటే, క్యాలెండర్లలో తేదీల లెక్కింపు నుంచి మొదలుకొని, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) లోని అటామిక్ క్లాక్ల వరకు, విమానయాన సమయపాలన వంటి అనేక వ్యవస్థలలో కీలకమైన సర్దుబాట్లు చేయాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.