శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అభిషాన్ జీవింత్ రూపొందించిన కామెడీ డ్రామా చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. మే 1న విడుదలైన ఈ సినిమాను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇటీవల సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
“అద్భుతమైన సినిమా చూశాను. హృదయాన్ని కదిలించింది, కడుపుబ్బా నవ్వించింది. అభిషాన్ చక్కగా రచించి, దర్శకత్వం వహించారు. ఈ మధ్యకాలంలో చూసిన ఉత్తమ చిత్రాల్లో ఇది ఒకటి. తప్పకుండా చూడండి” అంటూ రాజమౌళి కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం గురించి పోస్ట్ చేశారు.
కోలీవుడ్ హీరోలు రజనీకాంత్, సూర్య, శివకార్తికేయన్, టాలీవుడ్ హీరో నాని కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దాదాపు రూ.10 కోట్ల లోపు బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.75 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.
ఈ సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. జూన్ 2 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.