బీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ కన్నుమూశారు. గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
బాణోత్ మదన్ లాల్ మొదటిసారిగా 2009 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2012లో వైఎస్ఆర్ సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్(నాటి టీఆర్ఎస్) పార్టీలో చేరారు.
2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయనకు భార్య మంజుల, కుమారుడు మృగేందర్ లాల్ ఉన్నారు. కుమారుడు ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.