ఈపీఎఫ్ వడ్డీలో మార్పు లేదు: గత ఏడాదిలాగే 8.25 శాతం కొనసాగింపు

V. Sai Krishna Reddy
2 Min Read

ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయిస్తూ ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చేసిన సిఫార్సును కేంద్రం యథాతథంగా ఆమోదించింది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా చందాదారులకు ఇదే స్థాయిలో 8.25 శాతం వడ్డీని ఈపీఎఫ్‌ఓ అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా అదే వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించడంతో, సుమారు 7 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, త్వరలోనే ఈ వడ్డీ మొత్తాన్ని చందాదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ఈపీఎఫ్‌ఓ చర్యలు తీసుకోనుంది.

మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి

తమ పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి, అలాగే ఖాతాలోని నిల్వ వివరాలను చూసుకోవడానికి చందాదారులకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

*ఉమాంగ్ యాప్ ద్వారా: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో ఉమాంగ్ యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత, ఈపీఎఫ్‌ఓ సేవల విభాగానికి వెళ్లాలి. అక్కడ మీ యూఏఎన్, ఓటీపీని నమోదు చేయడం ద్వారా మీ ఖాతా బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలను పొందవచ్చు.

ఈపీఎఫ్‌ఓ పోర్టల్ ద్వారా: www.epfindia.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం ‘మెంబర్ పాస్‌బుక్’ ఆప్షన్‌ను ఎంచుకుని మీ ఖాతా వివరాలను చూసుకోవచ్చు.

మిస్డ్ కాల్ ద్వారా: మీ ఈపీఎఫ్ ఖాతాతో అనుసంధానించబడిన మొబైల్ నంబర్ నుంచి 99660 44425 అనే నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. కాల్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత మీ మొబైల్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో బ్యాలెన్స్ వివరాలు అందుతాయి.

ఎస్సెమ్మెస్ ద్వారా: మీ యూఏఎన్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి 77382 99899 నంబర్‌కు “EPFOHO UAN TEL” (తెలుగులో సమాచారం కోసం TEL అని టైప్ చేయాలి) అని సందేశం పంపడం ద్వారా కూడా మీ పీఎఫ్ ఖాతాలోని నిల్వ వివరాలను పొందవచ్చు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *