కిమ్ చూస్తుండగానే… ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం!

V. Sai Krishna Reddy
2 Min Read

ఉత్తర కొరియాలో బుధవారం ఓ నూతన డిస్ట్రాయర్ యుద్ధనౌక జలప్రవేశ కార్యక్రమం అపశ్రుతితో ముగిసింది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఘటనతో ఉత్తర కొరియా నౌకాదళ విస్తరణ ప్రణాళికలకు ఆరంభంలోనే కొంత ఆటంకం ఏర్పడినట్లయింది. సిబ్బంది అనుభవరాహిత్యంతో కూడిన కమాండ్, కార్యాచరణలో నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదం కారణంగా యుద్ధనౌకలోని కీల్ (నౌక కింది పొడవైన భాగం) కొన్నిచోట్ల ధ్వంసమైందని, నౌక ముందు భాగం షిప్‌వే నుంచి బయటకు రాలేకపోయిందని కేసీఎన్ఏ తన నివేదికలో పేర్కొంది. దీంతో నౌక జలప్రవేశం నిలిచిపోయింది.

ఈ ‘బాధ్యతారహితమైన తప్పిదాలకు’ పాల్పడిన వారిపై వచ్చే నెలలో జరగనున్న పార్టీ సెంట్రల్ కమిటీ ప్లీనరీ సమావేశంలో కఠిన చర్యలు తీసుకుంటామని కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించినట్టు సమాచారం. అంతేకాకుండా, దెబ్బతిన్న యుద్ధనౌకకు జూన్ లోగా మరమ్మతులు పూర్తి చేసి, సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

గత నెలలోనే కిమ్ జోంగ్ ఉన్ ఈ కొత్త 5,000 టన్నుల బరువున్న డిస్ట్రాయర్‌ను ఆవిష్కరించారు. తన అణుసాయుధ సైనిక దళం కార్యాచరణ పరిధిని విస్తరించడంలోనూ, ముందస్తు దాడి సామర్థ్యాలను పెంచుకోవాలన్న తన లక్ష్యంలో ఇదో కీలక ముందడుగు అని అప్పట్లో ఆయన ప్రకటించారు. అమెరికా, ఆసియాలోని దాని మిత్రదేశాల నుంచి ఎదురవుతున్నాయని భావిస్తున్న ముప్పునకు ప్రతిస్పందనగానే ఈ ఆయుధ సమీకరణ చేపడుతున్నట్టు కిమ్ పలుమార్లు తెలిపారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా, దాని మిత్రపక్షాలు సంయుక్త సైనిక విన్యాసాలను విస్తృతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తన నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో అణుశక్తితో నడిచే జలాంతర్గామిని సమకూర్చుకోవడమే తన తదుపరి ప్రధాన లక్ష్యమని కూడా కిమ్ గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *