అమెరికాలో టోర్నడోల బీభత్సం… వేల భవనాలు ధ్వంసం, చీకట్లో టెక్సాస్, ఓక్లహామా

V. Sai Krishna Reddy
1 Min Read

మధ్య అమెరికాలోని పలు రాష్ట్రాలు టోర్నడోల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సోమవారం సంభవించిన నాలుగు శక్తివంతమైన టోర్నడోలు టెక్సాస్ నుంచి కెంటకీ వరకు విస్తృత ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. ఈ పెనుగాలుల ధాటికి అనేక భవనాలు కుప్పకూలగా, విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో అనేక నగరాలు, పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి.

ఓక్లహామా రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ ఒక అగ్నిమాపక కేంద్రంతో పాటు కనీసం పది నివాస గృహాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు 1,15,000 మంది ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక చీకటిలోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. టోర్నడోల ప్రభావంతో పలు జాతీయ రహదారులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ఉత్తర టెక్సాస్‌లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఇక్కడ సుమారు 11.4 సెంటీమీటర్ల వ్యాసంతో కూడిన పెద్ద పెద్ద వడగళ్లు పడ్డాయని స్థానిక వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. మరోవైపు, సెయింట్ లూయిస్ నగరంలో టోర్నడోల వల్ల కనీసం 5,000 భవనాలు దెబ్బతిన్నాయని, దీనివల్ల సుమారు 1 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.

ముఖ్యంగా కెంటకీ రాష్ట్రం టోర్నడోల తాకిడికి తీవ్రంగా నష్టపోయింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇప్పటివరకు 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నష్టాన్ని అంచనా వేసే పనులు కొనసాగుతున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *