భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం తాలిబన్ల తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకితో అధికారికంగా ఫోన్ కాల్ మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వంతో భారత్ చేసిన తొలి మంత్రి స్థాయి సంప్రదింపులు కావడంతో సర్వత్రా ప్రాముఖ్యత సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులను చంపడంపై యావత్ ప్రపంచం స్పందించింది. దీనిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం కూడా ఈ దాడిని ఖంచడాన్ని మంత్రి జైశంకర్ స్వాగతించారు. ఈ విషయాన్ని మంత్రి జైశంకర్ స్వయంగా తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. తాలిబన్తో తొలిసారి మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం గమనార్హం. తాలిబన్ ప్రభుత్వంలో ఫోన్ సంభాషణ తర్వాత జైశంకర్.. ‘ఈ రోజు సాయంత్రం తాత్కాలిక ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తాకీతో మంచి సంభాషణ జరిగింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఆయన ఖండించడం హర్షణీయం. ఆఫ్ఘన్ ప్రజలతో భారత్ సాంప్రదాయ స్నేహాన్ని కొనసాగిస్తాం. వారి అభివృద్ధి అవసరాలకు సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అంశాలపై చర్చించామని’ ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.