వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రం హామీ… సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

V. Sai Krishna Reddy
2 Min Read

వక్ఫ్ ఆస్తుల విషయంలో గానీ, వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకంలో గానీ ఎలాంటి మార్పులు చేయబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మరోసారి హామీ ఇచ్చింది. వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయడం లేదా వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడం వంటి చర్యలు చేపట్టబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రెండో అత్యున్నత న్యాయాధికారి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ తదుపరి విచారణ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

వక్ఫ్ (సవరణ) చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ ఏ.జి. మసీహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టం అమలుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటే సుదీర్ఘ విచారణ అవసరమని పిటిషనర్లు కోరడంతో, ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. వక్ఫ్ చట్టం, 1995 చెల్లుబాటును సవాలు చేసే పిటిషన్లను స్వతంత్రంగా విచారిస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

వక్ఫ్ చట్టం దుర్వినియోగాన్ని అరికట్టేందుకే సవరణలు తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తన ప్రాథమిక అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని, దేశంలోని వక్ఫ్ బోర్డుల నిర్వహణ పారదర్శకంగా జరగాలనేదే తమ ఉద్దేశమని తెలిపింది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూములను కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించిన ఉదంతాలున్నాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరించింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణను ఆధునికీకరించేందుకే ఈ సవరణలు తెచ్చామని, ఇవి కేవలం పరిపాలనాపరమైనవే తప్ప, ఇస్లాం మత విశ్వాసాలు లేదా ఆచారాలకు సంబంధించినవి కావని కేంద్రం వాదించింది.

వక్ఫ్ అంటే…
ఇస్లామిక్ చట్టాలు, సంప్రదాయాల ప్రకారం మసీదులు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం ముస్లింలు చేసిన దానం లేదా విరాళమే ‘వక్ఫ్’.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *