వీర జవాను మురళీ నాయక్ శవపేటిక మోసిన మంత్రి నారా లోకేశ్

V. Sai Krishna Reddy
2 Min Read

దేశ రక్షణలో భాగంగా జమ్మూకశ్మీర్ సరిహద్దులో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా వాసి, జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గోరంట్ల మండలం కళ్లి తండాలో అశ్రునయనాల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, అమర జవానుడి భౌతికకాయం ఉన్న శవపేటికను స్వయంగా తన భుజాలపై మోసి అందరినీ కదిలించారు. మురళీనాయక్ పార్థివ దేహానికి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రస్తావిస్తూ, అటువంటి దుశ్చర్యల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో మురళీనాయక్ వీరమరణం పొందారని తెలిపారు. చిన్నప్పటి నుండే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో మురళీనాయక్ ఉండేవారని, “చనిపోతే భారత జెండా కప్పుకుని చనిపోతా” అని తరచూ అనేవారని మంత్రి గుర్తుచేసుకున్నారు.

కుటుంబానికి ఏకైక కుమారుడైన మురళీనాయక్, చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించడం అత్యంత బాధాకరమని అన్నారు. సరిహద్దుల్లో మన సైనికులు అహర్నిశలు పోరాడుతున్నందునే దేశ ప్రజలంతా సురక్షితంగా ఉండగలుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వ చేయూత

మురళీనాయక్ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు, కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు నిర్మించుకోవడానికి 300 గజాల ఇంటి స్థలం కేటాయించనున్నట్లు వెల్లడించారు. మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

కళ్లి తండా పేరు మార్పు… ఇక మురళీ నాయక్ తండా

మురళీనాయక్ అంత్యక్రియలు వారి సొంత భూమిలోనే నిర్వహిస్తున్నందున, అక్కడే ఆయన జ్ఞాపకార్థం ఒక మెమోరియల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, జిల్లా కేంద్రంలో మురళీనాయక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయన త్యాగనిరతిని భావి తరాలకు స్ఫూర్తిగా నిలిపేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ సందర్భంగా, కళ్లితండా గ్రామ సర్పంచ్, గ్రామస్థులు చేసిన విజ్ఞప్తి మేరకు, గ్రామానికి ‘మురళీనాయక్ తండా’గా పేరు మార్చనున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ సైనికుల కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *