ఇద్దరు ఐపీఎస్ అధికారులపై తదుపరి క్రమశిక్షణా చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో పల్నాడు, అనంతపురం జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో నాటి పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా అప్పటి ఎస్పీ అమిత్ బర్దార్పై ఈసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
అయితే తాజాగా ప్రభుత్వం ఆ ఘటనలకు సంబంధించి ఇరువురు అధికారుల నుంచి వివరణలు తీసుకుంది. వారి వివరణతో సంతృప్తి చెందిన ప్రభుత్వం తదుపరి క్రమశిక్షణా చర్యలను నిలిపివేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.