పాకిస్థాన్ రేంజర్ల కాల్పులు… సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని అమిత్ షా ఆదేశాలు

V. Sai Krishna Reddy
1 Min Read

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” అనంతరం, పాకిస్థాన్ రేంజర్లు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో పదిమంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు.

పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతిస్పందనగా, భారత భద్రతా దళాలు “ఆపరేషన్ సింధూర్” పేరిట పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి. ఈ చర్యతో సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి.

భారత బలగాల చర్య అనంతరం, పాకిస్థాన్ రేంజర్లు భారత భూభాగంలోని పౌర ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారని భారత ఆర్మీ వెల్లడించింది. ఈ కాల్పుల కారణంగా పదిమంది అమాయక పౌరులు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పారామిలిటరీ బలగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, సెలవుల్లో ఉన్న సిబ్బందిని తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *