భారత్-పాక్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం: అమెరికా

V. Sai Krishna Reddy
1 Min Read

భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తాను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఈ వివాదానికి త్వరలోనే ముగింపు పలకాలని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని రూబియో ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. శాంతియుత పరిష్కారం కోసం ఇరు దేశాల నాయకత్వంతో చర్చలు కొనసాగిస్తామని ఆయన అన్నారు.

అంతకుముందు, ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, “ఇది విచారకరం. చాలా కాలంగా వారు పోరాడుతున్నారు. ఇది చాలా త్వరగా ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను,” అని వైట్‌హౌస్‌లో విలేకరులతో అన్నారు. భారత్ జరిపిన దాడులు ఊహించినవేనని, త్వరగా ఈ ఉద్రిక్తతలు చల్లారాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.

భారతదేశం జరిపిన దాడుల అనంతరం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్… అమెరికా విదేశాంగ మంత్రిగా అదనపు జాతీయ భద్రతా సలహాదారు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న మార్కో రూబియోతో మాట్లాడి, తీసుకున్న చర్యల గురించి వివరించినట్లు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. “భారత్ చర్యలు నిర్దిష్టంగా, కచ్చితంగా ఉన్నాయి. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, పాకిస్థానీ పౌరులు, ఆర్థిక లేదా సైనిక లక్ష్యాలపై దాడి చేయలేదని” ఎంబసీ స్పష్టం చేసింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో పాకిస్థాన్ విఫలమైందని, నిరాధార ఆరోపణలు చేస్తోందని భారత్ పేర్కొంది.

భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితి తీవ్రమైనదని, దీనిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు. శాంతియుత, బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరు దేశాలతో అమెరికా నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఆమె వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *