పహల్గాం ఉగ్రవాది దాడి అనంతరం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి 2022లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి బహుళ రుణాలతో డిఫాల్ట్ అంచున ఉన్న స్థితి నుంచి కాస్త బయట పడింది.. ఇక 2025 మార్చిలో ఇదే ఐఎంఎఫ్ 2 బిలియన్ డాలర్ల రుణాలను ఆమోదించిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్థిక పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయనే కామెంట్లు వినిపించాయి. అయితే… జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం కఠినమైన దౌత్య చర్యలు తీసుకున్న అనంతరం.. పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆర్థిక పునరుద్ధరణ నిలిచిపోవచ్చనే చర్చ మొదలైంది.
అవును… పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… పాకిస్థాన్ తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయడం, సార్క్ వీసా మినహాయింపు పథకం కింద వీసాలను రద్దు చేయడం, సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటివి ఉన్నాయి. ఈ చర్యలు ఇప్పటికే ఇబ్బందులో ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని పెంచుతాయని.. ఇటీవల కాలంలో తగ్గిన ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చని చెబుతున్నారు. ఈ సమయంలో జూన్ 2025 ముగిసే ఆర్థిక సంవత్సరానికి దేశ సగటు ద్రవ్యోల్బణం 5.5% నుంచి 7.5% మధ్య ఉంటుందని పాకిస్థాన్ కేంద్ర బ్యాంక్ అంచనా వేసింది.
ప్రస్తుతం వెలువడుతున్న నివేదికల ప్రకారం.. బియ్యం, కూరగాయలు, పిండి, చికెన్, పండ్లు వంటి ప్రాథమిక ఆహార పదార్థాల ధరలు బాగా పెరిగాయని సూచిస్తున్నాయి. ఇందులో భాగంగా… బియ్యం ధర కిలో రూ.340కి, చికెన్ ధర కిలోకు రూ.800కి పెరిగిందని మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది పాకిస్థాన్ లో సుమారు 10 మిలియన్లకు పైగా ప్రజలు తీవ్ర ఆహార అభద్రత ఎదుర్కొంటారని, ఆకలి సమస్యను ఎదుర్కొంటారని ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదికకు తోడు తాజా పరిస్థితులు తోడవ్వడం మరింత ఆందోళనలను పెంచుతుందని అంటున్నారు. వాస్తవానికి పాకిస్థాన్ కు భారత్ నుంచి పెద్దమొత్తంలో అవసరమైన పండ్లు, కూరగాయలు, కోళ్ల దాణా, డ్రైఫ్రూట్స్ ఎగుమతి అవుతుంటాయి. అయితే.. తాజాగా జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ వాణిజ్యాన్ని నిలిపివేయడం వల్ల ఈ వస్తువుల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా సామాన్య పాకిస్థానీయుల దైనందిన జీవితాలు మరింత దిగజారిపోతాయని చెబుతున్నారు