రేపు ‘స్విచ్చాఫ్ లైట్స్’కు పిలుపునిచ్చిన అసదుద్దీన్ ఒవైసీ

V. Sai Krishna Reddy
2 Min Read

వక్ఫ్ సవరణ చట్టం-2025ని నిరసిస్తూ ఈ నెల 30వ తేదీన దేశవ్యాప్తంగా ‘లైట్స్ ఆఫ్’కు మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఆ రోజున రాత్రి తొమ్మిది గంటలకు లైట్లను స్విచ్చాఫ్ చేయాలని సూచించారు.

ఏఐఎంపీఎల్‌బీ నిరసన కార్యక్రమాలు

వక్ఫ్ సవరణ చట్టం-2025ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) దేశవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 30న ‘లైట్స్ ఆఫ్’ పేరుతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ రోజు రాత్రి 9 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లో 15 నిమిషాల పాటు లైట్లను స్విచ్ ఆఫ్ చేసి, ఈ చట్టంపై తమ వ్యతిరేకతను శాంతియుతంగా తెలియజేయాలని బోర్డు కోరింది.

ఇటీవల హైదరాబాద్‌లో మజ్లిస్ సహకారంతో ‘వక్ఫ్‌ను రక్షించండి, రాజ్యాంగాన్ని కాపాడండి’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో, ఆందోళనను మరింత ఉద్ధృతం చేయాలని ఏఐఎంపీఎల్‌బీ నిర్ణయించింది. ఆ సభకు వేలాది మంది ప్రజలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసీపీ, డీఎంకే సహా పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

‘వక్ఫ్ రక్షణ’ పేరిట చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమం జూలై 13న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభతో ముగియనుంది. ఈ లోగా, కొత్త చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, దానిని రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఏఐఎంపీఎల్‌బీ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రచార కార్యక్రమాలను ఎలా నిర్వహించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై బోర్డు తమ రాష్ట్ర, జిల్లా విభాగాలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని కార్యక్రమాలు క్రమశిక్షణతో, అహింసాయుతంగా జరగాలని నొక్కి చెప్పింది.

“బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, ప్రచారానికి సహకారం లభించే అవకాశం ఉండదని, కాబట్టి వీధి ప్రదర్శనలు లేదా బహిరంగ నిరసనలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాం” అని ఏఐఎంపీఎల్‌బీ అధికార ప్రతినిధి సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *