జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటామనే భయంతో.. పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) అంతటా అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయడం ప్రారంభించిందని నిఘా వర్గాలు సోమవారం వెల్లడించాయి.. భారత దాడులను నివారించడానికి ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, భూగర్భ బంకర్లలోకి మారుస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి..
పీఓకే ప్రాంతం అంతటా చాలా లాంచ్ ప్యాడ్లు ఉన్నట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించిన కొంతసేపటికే.. పాకిస్తాన్ ఈ చర్య తీసుకుంది.. కెల్, సర్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుటా, కోట్లి, ఖుయిరట్టా, మంధర్, నికైల్, చమన్కోట్, జంకోట్ నుండి ఉగ్రవాదులను తరలించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ లాంచ్ ప్యాడ్లు చాలా కాలంగా ఉగ్రవాదులను నియంత్రణ రేఖ (ఎల్ఓసి) దాటి జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేవేశించడానికి..అలాగే.. ఉగ్రవాదులను సమీకరించే కీలక కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. భారత నిఘా, ముందస్తు చర్యల నుంచి తన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కాపాడుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎల్ఓసి వెంబడి ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి.. ఈ ఉగ్రదాడిలో 26 మంది మరణించారు.
గత వారం, భారత భద్రతా దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా పనిచేస్తున్న కనీసం 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు, శిక్షణా కేంద్రాలపై నిఘా పెట్టాయి. నిఘా నివేదికల ప్రకారం, 150 నుండి 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ప్రస్తుతం వివిధ శిబిరాల్లో ఉండి, చొరబాటు ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్ (HM), జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కరే-ఎ-తోయిబా (LeT) నుండి దాదాపు 60 మంది విదేశీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో చురుగ్గా ఉన్నారని, 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు నివేదించాయి.