ఏపీకి వర్ష సూచన.. తెలంగాణలో ఎండ తీవ్రత

V. Sai Krishna Reddy
1 Min Read

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో సోమవారం (నేడు) పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడ వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మంగళవారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా.. అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో 41.4 డిగ్రీలు, విజయనగరం జిల్లా గుర్లలో 41.2 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. సోమవారం ఉదయం మెదక్ లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ లో 35 డిగ్రీల టెంపరేచర్ నమోదైందని అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, భద్రాచలం, రామగుండం, నిజామాబాద్, హనుమకొండ జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *