కేంద్ర నిఘా సంస్థ పేరుతో వదంతులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ

V. Sai Krishna Reddy
1 Min Read

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఆసరాగా చేసుకుని, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వదంతులపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మండిపడ్డారు. ‘భారత ప్రభుత్వం అత్యవసర భద్రతా సలహా’ జారీ చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న తప్పుడు వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రజలు నమ్మవద్దని, వీటిని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయని, దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను హై-అలర్ట్ జోన్లుగా ప్రకటించారంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. “ఇప్పటివరకు భారత ప్రభుత్వం గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గానీ అధికారికంగా ఎలాంటి అత్యవసర భద్రతా సలహాలను గానీ, హై-అలర్ట్ జోన్ల ప్రకటనలను గానీ జారీ చేయలేదు” అని హరీశ్‌కుమార్‌ గుప్తా తేల్చి చెప్పారు.

ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన అన్నారు. పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ధృవీకరించని సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి వార్తను గుడ్డిగా నమ్మవద్దని సూచించారు.

ప్రశాంతతకు భంగం కలిగించేలా లేదా ప్రజలను తప్పుదోవ పట్టించేలా వదంతులను వ్యాప్తి చేసే వారిని ఉపేక్షించేది లేదని డీజీపీ గుప్తా గట్టిగా హెచ్చరించారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే, అధికారిక ప్రభుత్వ ప్రకటనల కోసం వేచి చూడాలని లేదా పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *