అమెరికా-చైనా ట్రేడ్ వార్… ఇక ఐఫోన్ల తయారీ అంతా భారత్ లోనే!

V. Sai Krishna Reddy
2 Min Read

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య తీవ్రతరమవుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్‌ కు తరలించాలని యోచిస్తోంది. 2026 నాటికి ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్ లోనే చేపట్టాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

టారిఫ్ ల నుంచి తప్పించుకునేందుకేనా?

అమెరికా, చైనా దేశాలు పరస్పరం దిగుమతులపై భారీ సుంకాలను విధించుకుంటుండటంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు ముదురుతోంది. ఈ క్రమంలో చైనాలో తయారైన ఉత్పత్తులను అమెరికాలోకి దిగుమతి చేసుకోవడం ఆపిల్ వంటి సంస్థలకు భారంగా మారింది. ముఖ్యంగా, చైనా నుంచి దిగుమతయ్యే ఐఫోన్లపై అమెరికాలో 145% వరకు పన్నులు చెల్లించాల్సి రావచ్చని అంచనాలున్నాయి. ఇదే జరిగితే, చైనాలో తయారైన ఐఫోన్‌ల ధర అమెరికా మార్కెట్లో గణనీయంగా పెరుగుతుంది. ఈ అదనపు భారాన్ని, వాణిజ్య అనిశ్చితిని అధిగమించేందుకు ఆపిల్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే ఉత్పత్తిని భారత్‌కు మార్చాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం

ప్రస్తుతం ఆపిల్ సంస్థ అమెరికా బయట తయారు చేస్తున్న మొత్తం ఐఫోన్లలో దాదాపు 80 శాతం చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. భారత్ వాటా సుమారు 14 శాతంగా ఉంది. అయితే, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ఎన్నికైనప్పటి నుంచే చైనాతో వాణిజ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆపిల్‌తో పాటు అనేక బహుళజాతి సంస్థలు చైనాకు ప్రత్యామ్నాయంగా బలమైన తయారీ కేంద్రాల కోసం అన్వేషణ ప్రారంభించాయి. ఇదే సమయంలో, 2020లో భారత ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (PLI) ప్రకటించింది. ఇది ఆపిల్‌ను ఆకర్షించింది. ఫలితంగా, మనదేశంలో ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను కంపెనీ వేగవంతం చేసింది.

గణనీయంగా పెరిగిన ఉత్పత్తి

గత ఆర్థిక సంవత్సరంలో ఆపిల్ సంస్థ భారత్‌లో సుమారు 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను తయారు చేసింది. ఇందులో 18 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం విశేషం. ఇది భారత్‌లో ఆపిల్ కార్యకలాపాల విస్తరణ వేగాన్ని సూచిస్తోంది.

ఇప్పుడు అమెరికా మార్కెట్‌కు అవసరమైన ఐఫోన్లను కూడా పూర్తిగా భారత్‌లోనే తయారు చేయాలని ఆపిల్ నిర్ణయిస్తే, అది భారత తయారీ రంగానికి, ముఖ్యంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి పెద్ద ఊతమిచ్చినట్లవుతుంది. ఒకవేళ ఆపిల్ ఈ ప్రణాళికను అమలు చేస్తే, భవిష్యత్తులో అమెరికా విపణిలో విక్రయించే ఐఫోన్లపై ‘మేడ్ ఇన్ ఇండియా’ అని కనిపించే అవకాశం ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *