కోర్టు ఆదేశాల మేరకు అఘోరీకి లింగనిర్ధారణ జరిపే అవకాశం

V. Sai Krishna Reddy
1 Min Read

గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు చీటింగ్ కేసులో అరెస్టు చేశారు. అయితే అఘోరికి సంగారెడ్డి జిల్లా జైలు అధికారులు షాక్ ఇచ్చారు. న్యాయమూర్తి ఆదేశాలతో అఘోరిని సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలుకు పోలీసులు తరలించగా, ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్‌లోనూ ఉంచలేమని జైలు అధికారులు తేల్చి చెప్పారు.

లింగ నిర్ధారణ జరిగితే గానీ ఇక్కడ ఉంచుకోలేమని అఘోరిని జైలు అధికారులు తిరిగి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. అయితే ట్రాన్స్ జెండర్లకు చంచల్ గూడ జైలులో ప్రత్యేక బ్యారక్ వసతి ఉండటంతో అధికారులు అక్కడకు తరలించారు.

పూజల పేరుతో తన వద్ద రూ.9.80 లక్షలు వసూలు చేసి అఘోరి మోసం చేసినట్లు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో ఉండే మహిళ ఫిబ్రవరి నెలలో మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే ఏపీకి చెందిన యువతిని అఘోరి శ్రీనివాస్ పెళ్లి చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లాడు. ఈ క్రమంలో అఘోరిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

సాంకేతిక ఆధారాలతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని బుధవారం హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు. పోలీసులు అఘోరిని చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు సంగారెడ్డి జిల్లాలోని కంది సబ్ జైలుకు అఘోరిని తరలించడంతో లింగ నిర్ధారణ సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించి ప్రత్యేక బ్యారక్‌లో అఘోరిని ఉంచారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *