ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ అర్ధశతకంతో కదం తొక్కగా, సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్తో ముంబై విజయాన్ని పూర్తి చేసింది. సన్రైజర్స్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు కేవలం 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.
లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ (46 బంతుల్లో 70 పరుగులు; 8 ఫోర్లు, 3 సిక్స్లు) బలమైన పునాది వేశాడు. బాధ్యతాయుతంగా ఆడుతూనే దూకుడు ప్రదర్శించిన రోహిత్, ఈ సీజన్లో వరుసగా రెండో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్ను వేగంగా ముగించాడు. విల్ జాక్స్ 22 పరుగులు, రికెల్టన్ 11 పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్ల విషయానికొస్తే, జయదేవ్ ఉనద్కత్, అన్సారీ, ఎషాన్ మలింగ తలో వికెట్ పడగొట్టారు. సన్ రైజర్స్ బౌలర్లు ముంబై బ్యాటింగ్ దూకుడును నిలువరించలేకపోయారు. దీంతో హైదరాబాద్ జట్టు తమ సొంత మైదానంలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
అంతకుముందు, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్ల క్రమశిక్షణాయుతమైన బౌలింగ్కు రైజర్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగారు.
సన్ రైజర్స్ కు టోర్నీలో ఇది ఆరో పరాజయం. దాంతో ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.