హైదరాబాద్‌కు ప్రపంచ నగరాలతోనే పోటీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ రాజధాని హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని, ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నామని స్పష్టం చేశారు.

గురువారం నాడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి పర్యటించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కుతో పాటు, ‘మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ’ తయారీ విభాగాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.

తమ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే ఒక ‘ఫ్యూచర్ సిటీ’ని అందిస్తోందని పేర్కొన్నారు. “రానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘విజన్-2047’ ప్రణాళికను రూపొందించాం. నగర అభివృద్ధి కోసం దేశ, విదేశీ కన్సల్టెంట్లు పని చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పించి, వారి వ్యాపారాలు లాభదాయకంగా సాగేలా చూసే బాధ్యత మాది” అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అభివృద్ధిలో తెలంగాణ.. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలతో పోటీ పడుతోందని తెలిపారు.

అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో తయారీ రంగం 9 శాతానికి పైగా వృద్ధి సాధిస్తోందని వివరించారు. ప్రభుత్వం ఇటీవల గ్రీన్ ఇండస్ట్రియల్, నూతన ఎంఎస్‌ఎంఈ పాలసీ-2025ను ఆమోదించిందని గుర్తుచేశారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం 4,200 దరఖాస్తులు రాగా, వాటిలో 98 శాతం దరఖాస్తులను కేవలం 15 రోజుల్లోనే పరిష్కరించామని చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా పారదర్శకంగా, వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *