ఎస్సీ కార్పొరేషన్ లో అక్రమ ప్రమోషన్లు

V. Sai Krishna Reddy
4 Min Read

ఎస్సీ కార్పొరేషన్ లో అక్రమ ప్రమోషన్లు

212 జీవోకు వ్యతిరేకంగా అపాయింట్ అయిన అనర్హులకు ఈడీలుగా ప్రమోషన్లు

డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ దందాలో పది లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు.

ప్రభుత్వ నిబంధనలు, హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఇద్దరు ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చిన వైనం

తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ లో మేనేజింగ్ డైరెక్టర్ ఇష్టారాజ్యం

ఫైల్ నెం.A1/60/2020 నకు ప్రభుత్వ ఆమోదం రానేలేదు.. గ్రీన్ ఇంక్ సంతకాలు, హైర్ వెహికిల్స్ వాడకం.

చైర్మన్ ఆదేశాలు తుంగలో తొక్కి, దళితుల సొమ్ముతో అధికారుల ఎంజాయ్.

తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కో-ఆపరేటివ్ డేవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎస్సీ కార్పొరేషన్)లో పనిచేస్తున్న ఉన్నతాధికారుల బుద్ధి ఇంకా మారడం లేదు. గత ఫిబ్రవరి 20న ఈ కార్యాలయ జనరల్ మేనేజర్ అయిన బొప్పూరి ఆనంద్ కుమార్ ను లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగి సరిగ్గా రెండు నెలలు గడువక ముందే ఇక్కడ మరో అవినీతి బాగోతానికి అధికారులు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ప్లానింగ్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) గా పని చేస్తున్న కే.బ్రహ్మచారి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ (జిల్లా కార్యాలయం)లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) విధులు నిర్వహిస్తున్న జి.శ్యాంసుందర్ ఈరువురికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా (ఈ.డి) పదోన్నతులు కల్పిస్తూ, డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ (డిసిపి) ఏకగ్రీవంగా తీర్మానం చేసి, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపడం జరిగిందని తెలుస్తోంది. సంబంధిత అక్రమ ప్రమోషన్ల ఫైలు నెంబర్ A1/60/2020.

అయితే ఈ ఇద్దరూ మొదట నల్లగొండ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ లో డైలీ వేజ్ క్రింద సెక్షన్ రైటర్లుగా నియామకం కాబడిన తొలినాళ్లలోనే నాటి ప్రభుత్వ జీవో ఎం.ఎస్ నెంబర్ 212 తేదీ. 22-4-1994 ను పరిశీలిస్తే వీరిద్దరూ నాటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం డైలీ వేజ్ నుండి రెగ్యులర్ సర్వీస్ లోకి తీసుకోవడానికి అప్పటికే ఇరువురికి కూడా ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి కాకపోవడం, వీరు నిర్వహిస్తున్న సెక్షన్ రైటర్ అనే ఉద్యోగం ప్రభుత్వ సాంక్షన్ పోస్ట్ కూడా కాదనీ సంబంధిత జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. నాటి ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారులు వ్యక్తిగతంగా సృష్టించుకున్న సెక్షన్ రైటర్ అనే ఉద్యోగానికి సంబంధిత 212 జీవో ప్రకారం ప్రభుత్వ ఫైనాన్స్ విభాగం నుండి వీరికి ఎలాంటి క్లియరెన్స్ లు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో చేసేది ఏమీ లేక ఈ ఇద్దరు ఉద్యోగులతో పాటు మరో ముగ్గురు సైతం ఇదే రకం ఉద్యోగం నిర్వహిస్తూనే ఈ మధ్యలోనే ఆ ముగ్గురు రిటైర్మెంట్ అయ్యారని సమాచారం.

గతంలో ఈ ఇద్దరు ఉద్యోగులు తమను జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేయాలని హైకోర్టును సంప్రదించగా, వీరిని జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగానికి కూడా ప్రమోట్ చేయడానికి వీలులేదని 2007లో నాటి నల్లగొండ జిల్లా కలెక్టర్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అయిన విజయానంద్ ఐఏఎస్ హైకోర్టులో వీరికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ హోదాలో తన అఫిడవిట్ ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ అఫిడవిట్ అనుసరిస్తూ హైకోర్టు వీరి కేసును కొట్టివేసింది. ఆ తర్వాతి కాలం అనంతరం వీళ్ళ ప్రమోషన్ల దందా జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి మొదలైతే, ప్రస్తుతం వీరి ప్రస్థానం నేడు అక్రమంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ప్రమోషన్ పొందే స్థాయికి చేరుకుంది.

డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీలో ఇంత నిర్లక్ష్యమా?

ఒక ప్రభుత్వ ఉద్యోగికి పదోన్నతి కల్పిస్తున్నప్పుడు ప్రతి శాఖలో డిపిసి ఉంటుంది. ఈ ప్రమోషన్ కమిటీలో సుమారు ఆరుగురు ఇతర శాఖలకు చెందిన అధికారుల బృందం పరిశీలనలో ఈ కమిటీ ప్రభుత్వ నిబంధనలు అన్నిటినీ కసరత్తు చేసిన అనంతరం తుది నిర్ణయాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఈ కమిటీకి చైర్మన్ గా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దే పూర్తి బాధ్యతగా నిర్వహిస్తారు. తన సొంత శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అక్రమ మార్గాన ఇంత దూరం రావడమే శాఖ పరమైన పెద్ద పొరపాటు. గత సర్వీస్ రికార్డులు, జీవోలు, సంబంధిత కోర్టు కేసులు, ఇవన్నీ పరిశీలనకు తీసుకోకుండానే అవలీలగా ఈ ఇద్దరు ఉద్యోగులకు ఈడీలుగా ప్రమోట్ చేస్తూ ఏకగ్రీవంగా ఆరుగురు అధికారుల బృందం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు చేయడం వెనుక పెద్ద
తతంగమే జరిగినట్లుగా ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రమోషన్ల దందా వెనుక పది లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చైర్మన్ ఆదేశాలు తుంగలో తొక్కి, దళితుల సొమ్ముతో అధికారుల ఎంజాయ్

కార్పొరేషన్ లో జరిగిన ఈ తంతు ఇలా ఉండగానే అక్రమంగా డీపీసీ తీర్మానం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇలా పంపుకున్నారో లేదో, ప్రభుత్వము నుండి ఇంకా ఆమోదం రాకుండానే అప్పుడే ఈ అక్రమ అధికారులు ఈడి స్థాయి హోదాలో ఎస్సీ కార్పొరేషన్ సొమ్మును ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రీన్ ఇంకు పెన్నులతో సంతకాలు, హైర్ వెహికిల్స్ వాడుతున్నట్లు తెలుస్తోంది.

తన కార్పొరేషన్ లో జరుగుతున్న ఈ అక్రమ ప్రమోషన్ల వ్యవహారాలు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన నగరిగారి ప్రీతం దృష్టికి రావడంతో ఆయన విచారణ చేయడానికి ప్రయత్నిస్తే, మీకు కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ లో వేలు పెట్టడానికి అధికారాలు లేవని మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ ప్రీతంకు అడ్డు తగులుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అక్రమ ప్రమోషన్ల దందా వెనకాల ఒక ఐ.ఎఫ్.ఎస్, ఇద్దరు ఐ.ఎ.ఎస్ లు కలసి చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *