గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కి తరలించారు. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన నారా కోడూరు – బుడంపాడు గ్రామాల మధ్య చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన మహిళా వ్యవసాయ కూలీలు ఆటోలో మిర్చి కోతల నిమిత్తం నీరుకొండ గ్రామానికి వెళ్తుండగా, వీరు ప్రయాణిస్తున్న ఆటోను నారా కోడూరు – బుడంపాడు గ్రామాల మధ్య ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మగా గుర్తించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 13 మంది కూలీలు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు