చర్ల, సెప్టెంబర్ 14, ప్రజాజ్యోతి: చర్ల మండలం కేశవపురం గ్రామపంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ప్రజలకు పాలన చేరువ చేయాలనే దృఢ సంకల్పంతో ఎంతో ముందు చూపుతో చిన్న చిన్న గ్రామపంచాయతీలుగా విడగొట్టడం జరిగింది. కానీ కొన్ని గ్రామపంచాయతీలోని సర్పంచులు కార్యదర్శులు ప్రభుత్వ ఆలోచనను తుంగలో తొక్కి వారి ఇష్టానుసారంగా పంచాయతీలలో అభివృద్ధి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. దీనికి నిదర్శనమే కేశవపురం గ్రామపంచాయతి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు మచ్చుకైనా కనిపించడం లేదు. అక్కడక్కడ మూడు బారిన మొక్కలు దర్శనమిస్తుంటాయి. గోతులు తవ్వి మొక్కలు నాటకుండా వదిలేసిన గుంటలు కనిపిస్తున్నాయి. మా పంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, పంచాయతీ సెక్రెటరీ సర్పంచులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదని, అసలు ఉన్నారా లేదా అన్నట్లుగా ఉన్నారని, పంచాయతీ నిధులు ఏమి చేస్తున్నారో, ఎందుకు పంచాయతీలో అభివృద్ధి జరగడం లేదో అర్థం కావడం లేదని కేశవపురం గ్రామస్తులు వాపోతున్నారు. కనీసం వీధిలైట్లు కూడా సరిగా వెలగడం లేదని, రోడ్లు సరిగా లేవని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మా పంచాయతీ అభివృద్ధి కుంటుపడడానికి గల కారణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- 1 view