అచ్చం పేట సెప్టెంబర్.27 ప్రజాజ్యోతి. ఆర్థికంగా వెనుకబడిన చెంచుల జీవనోపాధికి ఐ టి.డి.ఏ , ఆర్.డి.టీ ద్వారా వంద శాతం సబ్సిడీతో ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వాలంబన సాధించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం మన్ననూర్ గిరిజన భవనం లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 52 గ్రామాల చెంచు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష విలువ చేసే ఉపాధి యూనిట్లను 500 కుటుంబాలకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. చెంచులు వారి ఇష్టప్రకారం ఓబియంయంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఐ.టి.డి.ఏ తరపున 250 యూనిట్లు, ఆర్.డి.టి తరపున 250 యూనిట్లు వెరసి 500 యూనిట్లు ఐదు కోట్ల వ్యయంతో మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో దాదాపు 300 మంది వరకు ఆవులు, గేదెలు, మేకలు, గోర్లు, కోళ్లు పెంచుకుంటామని దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పాడి పశువులు యూనిట్లు తీసుకుంటున్న వారు విధిగా కొంత పచ్చి గడ్డి పంట సాగు చేసుకోవాలని అప్పుడే పశువులకు మంచి మేత దొరికి పాలు , మాంసం బాగా అభివృద్ధి అవుతుందన్నారు. ఇచ్చిన రుణాలు నెరుగా యూనిట్ల కొనుగోలు కె అందజేయడం జరుగుతుందని ఎవరికి తమ వ్యక్తిగత ఖాతాలో జమ చేయబడవన్నారు. మేలు రకం పాడి పశువులు ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుండి పశు సంవర్థక శాఖ ద్వారా కొనుగోలు చేయించి ఇవ్వడం జరుగుతుందని తగిన శిక్షణ, మెళకువలు సైతం అందించడం జరుగుతుందన్నారు. చెంచులు ఈ యూనిట్లను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి సాధించాలని, వృధా చేసుకోవద్దని సూచించారు. కొంత మంది వ్యవసాయ అనుబంధ యంత్రాలు, సౌండ్ సిస్టం, ఆటోలు, ఇటుక బట్టీల వ్యాపారం , హోటల్ , తదితర యూనిట్లకు సైతం దరఖాస్తు చేసుకున్నారని, వీటన్నింటినీ త్వరలో మంత్రి వర్యుల చేతుల మీదుగా వితరణ చేయించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్.డి.టి ప్రాంతీయ సంచాలకులు పుష్ప మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి జీవించడానికి ఆర్థిక అవసరాలు ఉంటాయని వాటిని పొందటానికి స్వయం ఉపాధి ఎంతో అవసరమన్నారు. స్వయం ఉపాధి కై ఇస్తున్న యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ మాట్లాడుతూ కొంత మంది చెంచులకు గైడ్ గా ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. అయితే ఇతరుల పై ఆధార పడకుండా స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధిస్తే జీవన శైలిలో మార్పు వస్తుందని ఆలోచనా విధానం మారుతుందన్నారు. స్వయం ఉపాధి విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ వంతుగా సహకారం అందిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాష్, పిడి డి.ఆర్.డి.ఓ నర్సింగ్ రావు, పశు సంవర్ధక అధికారి డా. రమేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్, వివిధ పెంటల నుండి వచ్చిన చెంచు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- 3 views