రంగు రంగుల పూలతో, కాషాయపు, మామిడి తోరణాలతో 4వ వార్డులో పండుగ వాతావరణం
మహబూబ్ నగర్ , అక్టోబర్ 2( ప్రజాజ్యోతి ప్రతినిధి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతకమ్మ పండుగ కావడంతో జిల్లా కేంద్రంలోని ఎదిర , 4వ వార్డు రెడ్డి మహిళా కమిటీ సభ్యులు ఒక్కేసి పూవేసి చందమామ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలా అంటూ బతుకమ్మ పాటలతో , రంగు రంగు పూలతో అందంగా ఏర్పాటు చేసిన బతుకమ్మల చుట్టూ వలయాకారంలో బొడ్డెమ్మలు వేస్తూ , బతుకమ్మ పాటలకనుగుణంగా కోలాటలాడుతూ , నృత్యాలు చేస్తూ ప్రజలను మంత్రముగ్ధులను చేయడం జరిగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు శనివారం రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారు లక్ష్మీ దేవిగా దర్శనమిస్తూ బాల్ రెడ్డి - లలిత దంపతుల చేతుల మీదుగా పూజలందుకున్నారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములిచ్చి రాత్రి 9 గంటలకు బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా రెడ్డి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రకృతి అందాలను పేర్చి బతుకమ్మ పండుగ ఆడతారని, ప్రతి ఇంటిలో మహిళలు బతుకమ్మలో గౌరమ్మను చూసుకుంటారని తెలిపారు. ప్రతి మహిళను గౌరవించే సంప్రదాయం తెలంగాణ లో ఉందని అలాగే తెలంగాణ సంస్కృతి సంప్రాదయాలను కనుమరుగు కాకుండా ఉండేలా , ప్రపంచంలో ఎక్కడాలేని పూల పండుగ మన రాష్టంలో బతుకమ్మ పండుగని చేసుకోవడం హర్షణీయమని అన్నారు. మన రాష్ట్రానికి చెందిన సాంస్కృతిక సంపదకు బతుకమ్మ చిరునామని,అద్బుతమైన ఈ పండుగను బావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ, ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవత గా కొలిచే సాంప్రదాయం మన తెలంగాణ లో మాత్రమే ఉందన్నారు.
తంగేడు పూలు బంతిపూలు గునుగు పూలు ఇలా పలు రకాల పూలతో బతుకమ్మను ప్రతి ఇంట్లో తయారుచేసి వాటిని అమ్మవారి దగ్గరికి తీసుకువచ్చి పూజ అనంతరం రెడ్డి కమిటీ ఆధ్వర్యంలోని మహిళలు, పురుషులు, చిన్నారులు, ఆకుపచ్చని పసుపు రంగు వస్త్రాలు ధరించి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పడుతూ, కోలాటాలు వేస్తూ, బొడ్డెమ్మలు వేయడం జరిగింది. పట్టు వస్త్రాలు ధరించి బతకమ్మ పాటలకు అనుగుణంగా చిన్నారులు చేసిన నృత్యాలు నాలుగో వార్డ్ లోని ప్రజలను ఆకర్షితులను చేశాయి. ఆదివారం ఉదయం రెండు గంటలకు రెడ్డి కమిటీ మహిళ సభ్యులు పెద్ద ఎత్తున బతుకమ్మలను తలపై పెట్టుకుని నాలుగో వార్డ్ లోని ఊరి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేయడం జరిగింది.
- 1 view